T MAHESH
బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్ పై మొదటి సంతకం
రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమం & ఆర్థిక బలహీన వర్గాల సంక్షేమం మరియు చేనేత&వస్త్ర శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సవితమ్మ గారు
ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపుపై రెండో సంతకం
వారంలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి
అమరావతి, 20 జూన్
రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించే దస్త్రంపై తొలి సంతకంతో రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమం & ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం మరియు చేనేత&వస్త్ర శాఖల మంత్రిగా శ్రీమతి సవితమ్మ గారు బాధ్యతలు చేపట్టారు..
గురువారం ఉదయం గం.10.35 ని.లకు సెక్రటేరియట్ భవనం బ్లాక్ నెం.4 నందు తనకు కేటాయించిన రూం నెం.131 లో మంత్రిగా సవితమ్మ బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉచిత డీఎస్సీ కోచింగ్, ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం కొనసాగింపు పతాకాలపై సంతకం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారని, ఆయన అడుగుజాడల్లో వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్ పై తొలి సంతకం చేశానన్నారు.
అదే విధంగా 2014-19లో 2173 మందికి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిన ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని కొనసాగించనున్నామన్నారు. వెనకబడిన తరగతుల సంక్షేమం కోసం త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. 2014-19 లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ ల నిర్మాణాలను సైతం పూర్తి చేస్తామన్నారు.
ఈ ప్రభుత్వంలో చేనేత కళాకారులు, హస్త కళాకారులకు తగిన సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వారానికి ఒక్కసారైనా సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు.
బీసీ కులానికి చెందిన మహిళకు వెనకబడుల తరగతుల మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. విభజన నాటికి రాష్ట్రంలో ఉన్న 32 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను 106 కి పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనన్నారు.
రాష్ట్రం బాగుండాలనే తపన కలిగిన వ్యక్తి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. దేశానికి బీసీ నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో తనకు బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
అనంతరం లేపాక్షి స్టోర్, చేనేత వస్త్రాల స్టాల్ ను సందర్శించి అక్కడ సమస్యలు తెలుసుకొని పరిష్కారిస్తానని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో MLA లు బీసీ సంక్షేమం మరియు ఈడబ్ల్యూస్ సంక్షేమం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.అనంత రాము, పరిశ్రమలు, చేనేత & వస్త్ర శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ, చేనేత & వస్త్ర శాఖ సెక్రెటరీ సునీత గారు కమిషనర్ ఎమ్. ఎమ్ నాయక్, బీసీ కార్పొరేషన్ ఎండీ జి. సి. కిషోర్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కృష్ణ మోహన్ మరియు బీసీ సంఘాల నాయకులు, చేనేత కళాకారులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
