మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌  క్లారిటీ ఇచ్చారు

కాంగ్రెస్ లోకి రఘురాం రాజన్..?” ఆర్బీఐ మాజీ గవర్నర్ ఏమన్నారంటే

న్యూ ఢిల్లీ

కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని వస్తోన్న వార్తలపై రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌  క్లారిటీ ఇచ్చారు..

తాను రాజకీయాల్లోకి రావడం తన కుటుంబానికి ఇష్టం లేదన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ పై తనకున్న అభిప్రాయం, ఆయనకు సూచనలు చేశారంటూ వస్తోన్న వార్తలపైనా స్పందించారు..

”ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నా ప్రజలు ఇంకా నన్ను నమ్మడం లేదు. నేను విద్యావేత్తను. నేను రాజకీయాల్లోకి రావడం నా కుటుంబం, భార్యకు ఇష్టం లేదు. దానికి బదులు నాకు సాధ్యమైనచోట తోచిన సహాయం చేయాలనుకుంటున్నా. ప్రభుత్వంలో నేను ఉన్నా, లేకున్నా.. వారి విధానాలు దారి తప్పుతున్నాయంటే వాటి గురించి తప్పకుండా మాట్లాడుతా” అని రఘురాం రాజన్‌ పేర్కొన్నారు.

రాహుల్‌ను అలా చిత్రీకరించడం..

”రాహుల్‌ గాంధీ తెలివైనవాడు, ధైర్యవంతుడు. ఆయనకు సలహాలు ఇచ్చానని అనుకోవడం పొరపాటే అవుతుంది. నానమ్మ, తండ్రిని కోల్పోయిన వారి కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడకూడదని అనుకుంటున్నా. రాజకీయాల్లో ఉండాలన్నా, జనాల మధ్య ఉండాలన్నా.. నావల్ల కాదు. కొవిడ్‌ సమయంలో ఆయన సరిగ్గా వ్యవహరించాడని అనుకుంటున్నా” అని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ వెల్లడించారు

అయితే, రాహుల్‌ వద్ద అన్ని సమాధానాలు లేవని అంగీకరించిన రాజన్‌ అందరూ చిత్రీకరిస్తున్న దానికంటే రాహుల్‌ భిన్నమైన వ్యక్తి అని అన్నారు. అనేక విషయాలపై ఆయనకు స్పష్టత ఉందని, ఎవరైనా వాటితో ఏకీభవించకపోతే వాటిపై చర్చ జరపాలన్నారు. అటువంటి చర్చలకు ఆయన సిద్ధంగానే ఉన్నారని చెప్పారు..

భారత్‌ జోడో యాత్ర సందర్భంలో రాహుల్‌గాంధీతో రాజన్‌ భేటీ కావడం చర్చనీయాంశమయ్యింది. జాతీయ సమగ్రత, మత సామరస్యాన్ని బలోపేతం చేసేందుకు దేశమంతా కాలినడకన పర్యటిస్తున్న వారికి తన మద్దతు ఉంటుందని రాజన్‌ అప్పట్లో పేర్కొన్నారు. ఆ క్రమంలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరనున్నారనే వార్తలు వచ్చాయి.

Leave a Comment